కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాడిని: సీఎం చంద్రబాబు

  • ఏపీకి అన్యాయం చేసిన కేంద్రానికి సహకరించొద్దు
  • అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలి
  • కేసీఆర్, జగన్ కలిసి నాటకమాడుతున్నారు
కేంద్రం సహకరించి ఉంటే ఏపీని ఇంకా బాగా అభివృద్ధి చేసే వాడినని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు చేతుల మీదుగా మహిళలకు పసుపు-కుంకుమ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,  ఏపీకి అన్యాయం చేసిన కేంద్రానికి ఎవ్వరూ సహకరించవద్దని కోరుతున్నానని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు రావాల్సి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలని, కేసీఆర్, జగన్ కలిసి నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ పై జరిగిన దాడి కేసు ద్వారా ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుక ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని కొందరు పెట్టుబడిదారులు తనను అడిగితే, టీడీపీ ఓడిపోదని, వారి పెట్టుబడులు ఎక్కడికి పోవని వారికి భరోసా కల్పించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
cm
Krishna District

More Telugu News